కరీంనగర్ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ఒక జిల్లా. జిల్లాకు ఉత్తరాన అదిలాబాదు జిల్లా, ఈశాన్యమున మహారాష్ట్ర మరియు చత్తీసుగఢ్ రాష్ట్రాలు, దక్షిణాన వరంగల్ జిల్లా, ఆగ్నేయాన మెదక్ జిల్లా, మరియు తూర్పున నిజామాబాదు జిల్లా సరిహద్దులు.
కరీంనగర్, సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణము చేయబడినది. పురాతన కాలము నుండి వేద అభ్యాసన కేంద్రముగా ప్రసిద్ధికెక్కినది. పూర్వము ఈ ప్రాంతమునకు 'సబ్బినాడు' అని పేరు. కరీంనగర్ మరియు శ్రీశైలములలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల II మరియు ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. నిజాం పరిపాలనలో కరీంనగర్ ఒక రాజధాని మరియు మాజీ భారత ప్రధానమంత్రి పీ.వీ.నరసింహా రావు వంటి పలు సుప్రసిద్ధ వ్యక్తులు ఈ జిల్లా వాస్తవ్యులే. గోదావరి నది ఈ ప్రాంత సౌందర్యమును మరింత ఇనుమడింపజేస్తున్నది. కరీంనగర్ గోండ్లు, కోయలు, చెంచులు మొదలైనటువంటి అనేక గిరిజన జాతులకు ఆవాసము. ఈ ప్రాంతీయులు సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో మంచి నిపుణులు.
నేటి కరీంనగర్ ప్రాంతాన్ని పూర్వం సబ్బినాడు అని వ్యవహరించేవారు. 1905కు పూర్వము జిల్లా ఎలిగండ్ల జిల్లాగా ప్రసిద్ధి చెందినది. 1905లో వరంగల్ జిల్లా నుండి పర్కాల తాలూకాను జిల్లాలో కలిపి, లక్సెట్టిపేట మరియు చిన్నూరు తాలూకాలను అదిలాబాద్ జిల్లాలో, సిద్దిపేట తాలూకాను మెదక్ లో చేర్చి జిల్లాను 7 తాలూకాలతో పునర్వ్యవస్థీకరించి కరీంనగర్ జిల్లాగా నామకరణము చేశారు.
0 comments:
Post a Comment